కదిరిలో ప్రశాంతంగా వినాయక నిమజ్జనం నిర్వహించాలి:జిల్లా ఎస్పీ
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో ఈ నెల 20న జరగనున్న వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ శుక్రవారం దత్త ఫంక్షన్ హాల్లో ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా నిమజ్జన ఏర్పాట్లు, శాంతిభద్రతలు, ట్రాఫిక్ నియంత్రణ, సమయపాలన, సౌండ్ సిస్టమ్ వినియోగం, ప్రజల సహకారం తదితర అంశాలపై కమిటీ సభ్యులకు ఎస్పీ పలు సూచనలు చేశారు.కదిరిలో వివిధ పండుగల సందర్భంగా హిందూ, ముస్లిం వర్గాలు పరస్పరం సహకరించుకుంటూ శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడం అభినందనీయమని ఎస్పీ గారు పేర్కొన్నారు. ఒకరి పండుగలను మరొకరు గౌరవిస్తూ సంప్రదాయాలను పరస్పరం గౌరవించుకోవడం కదిరి ప్రత్యేకతగా నిలుస్తోందన్నారు. కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయం సమీపంలోని మసీదును సందర్శించిన సందర్భంగా కూడా సోదరభావంతో కూడిన సానుకూల వాతావరణాన్ని గమనించినట్లు తెలిపారు. ఈ సంప్రదాయాన్ని ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఎస్పీ కోరారు.